పోలవరం ప్రాజెక్టు టెండర్లను రద్దు చేసి ఏం సాధిస్తారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. ఏపీ సీఎం జగన్ 100 రోజుల పాలనపై ఆయన నివేదిక విడుదల చేశారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ మంత్రి బొత్స సత్యనారాయణ తన ఆస్తులను అమ్మి పోలవరంను పూర్తి చేస్తారా? అని మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధి కోసం… టీడీపీ ఆరోపిస్తున్నట్టు మీ వద్ద ఉన్న లక్ష కోట్లను పెట్టుబడిగా పెడతారా? అని జగన్ ను ఉద్దేశించి అన్నారు.రాజధాని లేని రాష్ట్రంగా మనం వచ్చామని, అమరావతిని చాలా లోతుగా చూడాల్సి ఉందన్నారు.
అమరావతిని రాజధానిగా జగన్ సహా వైసీపీ నేతలంతా గతంలో సమర్థించారని గుర్తు చేశారు. ఇప్పుడు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. అమరావతిపై టీడీపీ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వలేదని మంత్రి బొత్స వ్యాఖ్యాలను ప్రస్తావిస్తూ అది టీడీపీ చేతకానితనం అనుకుందామని అన్నారు. ఇప్పుడు మీరు ఇవ్వండని తాను డిమాండ్ చేస్తున్నానని చెప్పారు. వైసీపీ మంత్రులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. అమరావతిలో ఇప్పటికే రూ. 8 వేల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టారని చెప్పారు. అమరావతి విషయంలో ఇష్టానుసారం వ్యవహరిస్తే రాజధానిని కట్టుకోగలమా? అని పవన్ ప్రశ్నించారు.