భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, బండారు దత్తాత్రేయ ఇటీవలే హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా నియమితుడైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దత్తన్నను కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి మంగళవారం కలిశారు. హైదరాబాద్, రామ్ నగర్ లోని దత్తన్న నివాసానికి వెళ్లిన జానా, దాదాపు 20 నిమిషాల పాటు ఆయనతో భేటీ అయినట్టు తెలుస్తోంది.
ఇదేమీ రాజకీయ భేటీ కాదని, గవర్నర్ గా నియమితులైనందుకు దత్తాత్రేయకు అభినందనలు తెలిపేందుకే జానారెడ్డి వచ్చారని ఆయన కార్యాలయం వర్గాలు వెల్లడించాయి. ఇది కేవలం మర్యాద పూర్వక భేటీయేనని సమాచారం. కాగా, ఎల్లుండి హిమాచల్ ప్రదేశ్ కు వెళ్లనున్న దత్తాత్రేయ, ఆ రాష్ట్ర గవర్నర్ గా బాధ్యతలను స్వీకరించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు సిమ్లాలో జరుగుతున్నాయి. దత్తాత్రేయ ఫ్యామిలీ కోసం రాజ్ భవన్ ను ప్రభుత్వ అధికారులు సిద్ధం చేస్తున్నారు.