ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో ఈ రోజు జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. ఏపీలో భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలతో పాటు ఇసుక కొరత పై గవర్నర్కు పవన్ వినతిపత్రం సమర్పించారు. గవర్నర్తో ఆయన దాదాపు అరగంట పాటు చర్చించినట్లు తెలుస్తోంది. భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా రాష్ట్రంలో ఇసుక సరఫరాను పునరుద్ధరించాలని కోరారు.
కార్మికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని పవన్ కోరారు. నూతన ఇసుక ప్రణాళికను వెంటనే ప్రవేశపెట్టాలని ఇటీవల జనసేన పార్టీ లాంగ్ మార్చ్ నిర్వహించిందని, అయినప్పటికీ ప్రభుత్వం సరైన రీతిలో స్పందించలేదని చెప్పారు. బతుకు దుర్భరమై దయనీయ స్థితిలో గడుపుతోన్న 35 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల వెతలను లేఖలో వివరిస్తూ గవర్నర్ కు పవన్ ఈ సందర్భంగా అందజేశారు.