ఏపీ సీఎం జగన్ పై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నిప్పులు చెరిగారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ రెడ్డి గారూ మీరు చాలా చిల్లరగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. విజయవాడ నడిబొడ్డున కూర్చుని చెబుతున్నానని, తాను ఫ్యాక్షన్ రాజకీయాలకు భయపడే వ్యక్తిని కాదని స్పష్టం చేశారు. సీఎం హోదాకు తగ్గట్టు హుందాగా మాట్లాడడం నేర్చుకోండని హితవు పలికారు. ఎన్నికల ప్రచారంలో ఎలాగూ చిల్లరగా మాట్లాడారని అన్నారు.
మా తల్లిదండ్రులు సంస్కారం నేర్పించారు. భాషా సంస్కారాలు మర్చిపోయి మీరు ఎంత హీనంగా మాట్లాడినా మేం మా స్థాయికి దిగజారి మాట్లాడమన్నారు. కచ్చితంగా పాలసీ విధానాలపైనే స్పందిస్తాం తప్ప వ్యక్తిగత విమర్శలు జోలికి వెళ్లంటూ తనదైన శైలిలో వ్యాఖ్యానించారు.ఇంగ్లీషు మీడియం వ్యవహారం రాష్ట్రంలో రాజకీయ పక్షాల మధ్య మాటలయుద్ధానికి కారణమైంది. అధికార పక్షం వైసీపీతో విపక్షాలు టీడీపీ, జనసేన సై అంటే సై అంటున్నాయి. ముఖ్యంగా తనపై సీఎం జగన్ వ్యక్తిగత విమర్శలు చేయడాన్ని పవన్ తీవ్రంగా పరిగణిస్తున్నారు. విద్యార్థులకు ఇంగ్లీషు మీడియం అమలు చేయాలంటే ముందు టీచర్లను సన్నద్ధం చేయాలని హితవు పలికారు.