ఆర్టికల్ 370ని రద్దు చేయడం పై పాకిస్థాన్ మండిపడుతోంది. కశ్మీరీ ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా భారత్ వ్యవహరిస్తోందని ఘోషిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు మధ్యాహ్నం 11 గంటలకు పాకిస్థాన్ పార్లమెంటు ఉభయసభలు అత్యవసరంగా సమావేశం కాబోతున్నాయి. జమ్ముకశ్మీర్, నియంత్రణ రేఖ వద్ద నెలకొన్న ఉద్రిక్తతలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.
భారత్ నిర్ణయాలపై మలేసియా, టర్కీ దేశాల ప్రధానులతో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఫోన్ లో మాట్లాడారు. భారత్ తీసుకుంటున్న నిర్ణయాలతో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత క్షీణించే అవకాశం ఉందని ఇమ్రాన్ తెలిపారు. ద్వైపాక్షిక చర్చలకు అవకాశం లేకుండా పోయే పరిస్థితి ఉందని అన్నారు. కశ్మీరీల కోసం దౌత్యపరంగా పోరాడుతామని చెప్పారు.జమ్ముకశ్మీర్ విషయంలో భారత ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలుచట్ట వ్యతిరేకమని పాకిస్థాన్ విదేశాంగ శాఖ ఓ ప్రకటన ద్వారా విమర్శించింది.