నిపుణులైన డాక్టర్ల బృందం పర్యవేక్షణలో తీవ్ర అస్వస్థతో ఆసుపత్రిపాలైన కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ చికిత్స పొందుతున్నారు. శ్వాస సంబంధ సమస్యతో జైట్లీ ఈ సాయంత్రం ఢిల్లీలోని ఎయిమ్స్ లో చేరిన సంగతి తెలిసిందే. ఆయనకు చికిత్స అందిస్తున్న ఎయిమ్స్ వైద్య బృందం మీడియాకు వివరాలు తెలిపింది. జైట్లీకి ప్రస్తుతం ఐసీయూలో చికిత్స అందిస్తున్నామని డాక్టర్లు వెల్లడించారు. ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని, చికిత్సకు స్పందిస్తున్నారని వివరించారు. జైట్లీ గత కొన్నిరోజులుగా కిడ్నీ, గుండె సమస్యలతో బాధపడుతున్నారు.
కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ అనారోగ్యంతో ఆసుపత్రిపాలైన సంగతి తెలిసిందే. ఆయన గత కొంతకాలంగా అనేక రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆమధ్య ఆయన మూత్రపిండాల మార్పిడి శస్త్ర చికిత్స చేయించుకున్నారు. అయితే శ్వాస సంబంధ సమస్యతో పాటు, గుండె, కిడ్నీల సమస్యలతో ఆయన ఈ సాయంత్రం ఢిల్లీలోని ఎయిమ్స్ లో చేరారు. జైట్లీని కుటుంబ సభ్యులు వీల్ చెయిర్ లో ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తమ సహచరుడ్ని పరామర్శించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఎయిమ్స్ కు వచ్చారు. జైట్లీ కుటుంబ సభ్యులను, డాక్టర్లను అడిగి వివరాలు తెలుసుకున్నారు. జైట్లీ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.