భారత ఆర్థిక రాజధాని ముంబయి మీద పాక్ కేంద్రంగా నడిచే ఉగ్రసంస్థ జైషే మహ్మద్ విరుచుకుపడే అవకాశం ఉందని నిఘా వర్గాలు ప్రభుత్వానికి వెల్లడించాయి. ముంబయితో పాటు జమ్ముకశ్మీర్లోని భద్రతా బలగాల లక్ష్యంగా దాడులు జరపవచ్చని హెచ్చరించాయి. 370 ఆర్టికల్ రద్దు కారణంగా పుల్వామ వంటి ఉగ్రఘటనలు చోటుచేసుకొనే అవకాశం ఉందని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే నిఘా వర్గాల నుంచి ఈ హెచ్చరికలు రావడం గమనార్హం. పాక్ లోని ఉగ్రవాదులకు మద్దుతు ఇస్తూ భారత్ మీదకు ఉసిగొల్పేలా ఆయన వ్యాఖ్యలు కనిపిస్తున్నాయని ఓ భద్రతా అధికారి అభిప్రాయపడ్డారు.
ఇమ్రాన్ వ్యాఖ్యలు చేసిన సమయంలోనే జైషే ఉగ్రసంస్థ అధినేత మసూద్ అజహర్ సోదరుడు రౌఫ్ అజ్గర్ రావల్పిండిలో జరిగిన సమావేశం అనంతరం పాక్ ఆక్రమిత కశ్మీర్ వైపు వచ్చినట్లు సమాచారం అందిందన్నారు. పంజాబ్ నుంచి అనేక మంది జేషే ఉగ్రవాదులను సరిహద్దు వద్దకు తరలించినట్లు నిఘా వర్గాలు వెల్లడించాయన్నారు. తమకు అందిన సమాచారం మేరకు దేశం లోపల ఆర్థికంగా నష్టపోయేలా, మౌలిక సదుపాయాలను దెబ్బతీసేలా దాడిచేసే అవకాశం ఉందన్నారు. దాని కోసం జేషేకు చెందిన ముగ్గురు సభ్యుల బృందాన్ని కేటాయించారని, స్థానికంగా ఉన్న స్లీపర్ సెల్స్ను యాక్టివేట్ చేశారని తెలిపారు. ఇదే కారణంతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ నియంత్రణ రేఖ వద్ద భద్రతా సంసిద్ధతను సమీక్షించడానికి జమ్ముకశ్మీర్కు వెళ్లారన్నారు. అలాగే కీలక ప్రాంతాల్లో భద్రతను పెంచాలని ఆ రాష్ట్ర పోలీసులకు కేంద్రం సూచించింది.
టీడీపీ నేతలు ఆ నిధులను కూడా మింగేశారు: విజయసాయిరెడ్డి