తాజాగా ఉపఎన్నిక జరిగిన హుజూర్ నగర్లో కాంగ్రెస్ ఓటమితో పీసీసీ చీఫ్ మార్పుపై మరోసారి హాట్ హాట్గా చర్చ జరుగుతోంది. ప్రస్తుతం పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి.. సొంత నియోజకవర్గలో భార్య పద్మావతిని గెలిపించుకోలేకపోయాడని.. అందుకే ఖచ్చితంగా పీసీసీ చీఫ్ను మారుస్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పీసీసీ మార్పు జరుగుతుందంటూ ఢిల్లీ నుండి బాగా ప్రచారం జరుగుతోందని.. అదే నిజమైతే మున్సిపల్ ఎన్నికల తర్వాత మార్చాలని అభిప్రాయపడ్డారు. పీసీసీ రేస్లో ఉన్నవారంతా సమర్థులేనన్న జగ్గారెడ్డి.. తానూ పీసీసీ అధ్యక్షుడి పదవి రేస్లో ఉన్నానని స్పష్టం చేశారు.
అవకాశమిస్తే పార్టీ బలోపేతం, ప్రజల సమస్యలపై పోరాటం చేస్తూనే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేస్తానని చెప్పారు జగ్గారెడ్డి. కేసీఆర్ పథకాలంటే అద్భుతమైన పథకాలు తన దగ్గర ఉన్నాయన్నారు. సీఎం పదవి ఆశించడకుండా పార్టీ కోసం పనిచేస్తామని తెలిపారు జగ్గారెడ్డి. అదిష్టానం పీసీసీ పదవి ఎవరికి ఇచ్చినా అందరం కలసి పనిచేయాలని ఆయన అన్నారు. ఈ విషయమై నవంబరు 17న ఢిల్లీ వెళ్లి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, అహ్మద్ పటేల్,కే సి వేణుగోపాల్ను కలుస్తానని స్పష్టం చేశారు.