తాను కాంగ్రెస్ను వీడి టీఆర్ఎస్లో చేరుతున్నట్లు జరుగుతున్న ప్రచారం పై సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పందించారు. అవసరమైతే రాజకీయాలకు దూరంగా ఉంటానని.. పార్టీ మాత్రం మారబోనని జగ్గారెడ్డి తేల్చి చెప్పారు. తాను కాంగ్రెస్ను వీడుతున్నాన్న వార్తల్లో వాస్తవం లేదని జగ్గారెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.పార్టీ మారాలని నన్ను ఎవరూ సంప్రదించలేదని పేర్కొన్నారు. తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు.
మరోసారి జైలుకు పంపించినా పోరాడుతానని, కాంగ్రెస్ను మాత్రం వీడనని తెగేసి చెప్పారు. గతంలోనూ ఓ సారి పార్టీ మారడం వల్ల ఇమేజ్ దెబ్బతిందన్న తన కూతురు జయారెడ్డి వ్యాఖ్యలు ఆలోచింపచేశాయని తెలిపారు..ఆమె మాటకు గౌరవం ఇస్తూ, కాంగ్రెస్ లోనే ఉండాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టం చేశారు. మరోవైపు జగ్గారెడ్డి కొద్దిరోజుల నుంచి అజ్ఞాతంలో ఉండటం, కాంగ్రెస్ నేతలు ఫోన్ చేసినా స్పందించకపోవడం టీపీసీసీలో చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో జగ్గారెడ్డి పార్టీ మారుతారని ప్రచారం జరిగింది.