వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఏపీ రాజకీయాలు వేడెక్కిన విషయం తెలిసిందే. అన్ని పార్టీలు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నాయి. అయితే.. ఈ విషయంలో టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. టీడీపీ ఎమ్మెల్యే గంట శ్రీనివాస్రావు ఏకంగా రాజీనామా కూడా చేశారు. అటు విజయసాయిరెడ్డి కూడా దీనిపై పాదయాత్రకు సిద్ధం అయ్యారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ విశాఖకు వెళ్లనున్నారు. మరి కాసేపట్లో విశాఖకు బయలుదేరనున్నారు సీఎం జగన్. గన్నవరం విమానాశ్రయం నుంచి 11.10 గంటలకు విశాఖ ఎయిర్పోర్ట్ చేరుకోనున్న సీఎం వైయస్.జగన్… 11.30 నుంచి 12.30 వరకు పెందుర్తి మండలం చినముషిడివాడలో విశాఖ శ్రీ శారదాపీఠం వార్షిక మహోత్సవంలో పాల్గొననున్నారు. 12.45 గంటలకు విశాఖ నుంచి బయలుదేరనున్న ముఖ్యమంత్రి.. మధ్యాహ్నం 2 గంటలకు తాడేపల్లి చేరుకోనున్నారు సీఎం వైయస్.జగన్. ఇది ఇలా ఉండగా…శాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశం పై నీతి ఆయోగ్ ఎట్టకేలకు స్పందించింది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ, దాని కోసం వచ్చిన ప్రతిపాదనలు బిజినెస్ సీక్రెట్ అని.. బయటకు చెప్పటం కుదరదని నీతి ఆయోగ్ స్పష్టం చేసింది. ప్రతిపాదన వివరాలను ఇవ్వాలని సమాచార హక్కు చట్టం ( R T I) కింద చేసిన దరఖాస్తుపై నీతి ఆయోగ్ ఈ సమాధానం చెప్పింది.