ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా జరుగుతున్నాయి. సభలో నామినేటెడ్ పదవుల పంపకాలపై చర్చ జరుగుతున్న వేళ, సీఎం వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. నామినేటెడ్ పదవులన్నీ రెడ్లకు ఇచ్చారని, తమ వారికి దోచిపెట్టడమే జగన్ లక్ష్యమని విపక్ష తెలుగుదేశం ఆరోపించగా జగన్ వివరణ ఇచ్చారు. కాపు కార్పొరేషన్ ను జక్కంపూడి రాజాకు ఇచ్చామని, ఏపీఐఐసీని ఆర్కే రోజాకు ఇచ్చామని చెప్పారు. నామినేటెడ్ పదవుల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు ఇచ్చామని అన్నారు. సగం పదవుల్లో మహిళలే ఉన్నారని గుర్తు చేశారు. వెరీ రిప్యూటెడ్ డాక్టర్, చాలా పేరుగాంచిన శ్రీమతి లక్ష్మీ పార్వతి, చైర్ పర్సన్, ఏపీ తెలుగు అకాడమీ పదవి ఇచ్చామని అన్నారు.
“అధ్యక్షా… చంద్రశేఖర్ రెడ్డికి ఏపీ స్టేట్ మెడ్ అండ్ ఇన్ ఫ్రా డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఇచ్చామని చెప్పారు. చంద్రబాబు వైపు చూస్తూ అధ్యక్షా వాళ్లగారి అత్త అధ్యక్షా…అత్తగారే. మీ పార్టీ వ్యవస్థాపకుడు, ఆయనగారి భార్య, చంద్రబాబు గారికి అత్తగారు… మీరు ఈ పదవి ఇవ్వలేదు. మేము పదవి ఇచ్చామని అన్నారు.
మిగతా నామినేటెడ్ పోస్టుల్లో ఎవరెవరిని నియమించామన్న విషయాన్ని చెబుతూ, అన్ని వర్గాలకూ న్యాయం చేసేలా పదవులు ఇచ్చామని జగన్ అన్నారు. 13 డీసీసీబీ చైర్మన్ పదవుల్లో సగం ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీలు, బీసీలే ఉన్నారని తెలిపారు. గతంలో మార్కెటింగ్ పదవులను సామాన్యులకు ఇచ్చిన దాఖలాలే లేవని విమర్శలు గుప్పించారు.