ఏపీ అసెంబ్లీ సమావేశాలుఐదో రోజు వాడివేడిగా కొనసాగుతున్నాయి. సభలో అధికార, విపక్ష సభ్యుల మధ్య నిన్న అసెంబ్లీ ముందు జరిగిన ఘటనపై తీవ్ర వాగ్వాదం జరిగింది. అధికార పార్టీ తరఫున పేర్ని నాని, బుగ్గన రాజేంద్రనాథ్ తదితరులు మాట్లాడుతూ, మార్షల్స్ తో అనుచితంగా ప్రవర్తించిన చంద్రబాబు క్షమాపణ చెప్పాల్సిందేనని పట్టుబట్టారు. ఈ వ్యవహారాన్ని తాను పరిశీలించానని, ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేస్తున్నానని స్పీకర్ తమ్మినేని ప్రకటించారు. ఈ సమయంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, గత అసెంబ్లీలో జరిగిన కొన్ని ఘటనలను ప్రస్తావించారు.
అసెంబ్లీ గేటు బయట నిన్న జరిగిన ఘటనకు సంబంధించిన వీడియోను హౌస్ లో ప్రదర్శించారు. ఈ వీడియోలో మార్షల్స్ ను బాస్టర్డ్, యూజ్ లెస్ ఫెలో అని తిట్టడంతో పాటు, చీఫ్ మార్షల్ కాలర్ ను లోకేశ్ పట్టుకున్నట్టు కనిపిస్తోంది. వారి మధ్య జరిగిన వాగ్వాదాన్ని చూపించిన తరవాత జగన్ మాట్లాడుతూ చంద్రబాబుపై మండిపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగస్తుడిని, డీఎస్పీ స్థాయి అధికారిని బాస్టర్డ్ అని తిట్టినందుకు చంద్రబాబు సిగ్గు పడాలని జగన్ అన్నారు.