నేడు ఏపీసీఎం జగన్ తన నూతన క్యాబినెట్ కోసం 25 మందితో కూడిన మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయనున్నారు. వీరు నేడు గవర్నర్ సమక్షంలో ప్రమాణస్వీకారం చేయనున్నారు. అయితే ఈ కూర్పుతో వైసీపీ లో కుమ్ములాటలు జరుగుతాయా అంటే.. ఇంతవరకు ఆ మేరకు చిన్న అసంతృప్తి కూడా కనపడకుండా జగన్ బాగానే మేనేజ్ చేశారు. సీఎం జగన్ తన మంత్రివర్గం జాబితాను గవర్నర్ నరసింహన్ కు సమర్పించారు. వైసీపీలో ఫైర్ బ్రాండ్ నేతగా పేరుపొందిన రోజా పేరు మంత్రివర్గంలో లేకపోవడంతో అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. వైసీపీ శాసనసభాపక్ష భేటీ ముగిసిన తర్వాత రోజా మాట్లాడుతూ, తనకు మంత్రి పదవి వస్తుందని 100 శాతం నమ్ముతున్నట్టు తెలిపారు. ఏ మంత్రి పదవి ఇచ్చినా న్యాయం చెయ్యడం, జగన్ కు మంచి పేరు తీసుకురావడమే తన లక్ష్యాలని చెప్పారు. క్యాబినెట్ మంత్రుల జాబితాలో రోజా పేరులేకపోవడం చర్చనీయాంశంగా మారింది. మంత్రివర్గ కూర్పు సమయంలో జగన్ ఇదే విషయమై రోజాతో రెండుసార్లు చర్చించి నచ్చజెప్పినట్టు తెలుస్తోంది.
కొన్ని సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని క్యాబినెట్ కూర్పు చేశామని, అందుకే మంత్రివర్గంలో చోటు కల్పించలేకపోతున్నామని జగన్ తెలిపినట్టు సమాచారం. అంతేగాకుండా, పార్టీలో ఇన్నాళ్లపాటు రోజా చేసిన సేవలను ప్రస్తావించిన జగన్ ఆమెను విజయవాడలోనే అందుబాటులో ఉండాలని కోరినట్టు ప్రచారం జరుగుతోంది. రోజాకు మరో కీలక పదవి ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నికల ఫలితాలు వచ్చాక జగన్ తిరుమల వచ్చినప్పుడు రోజా ప్రతి కార్యక్రమంలోనూ ఆయన వెన్నంటే ఉన్నారు. తద్వారా మంత్రి పదవి రేసులో తాను ముందున్నానని సంకేతాలు పంపారు. అనూహ్యంగా ఆమె పేరు లేకుండానే జగన్ తన క్యాబినెట్ కూర్పు చేయడం జరిగింది. నేడు ఆమె కు అప్పగించే బాధ్యతల గురించి జగన్ ప్రకటించే అవకాశాలు లేకపోలేదు.