ఇంటర్ బోర్డు ఫలితాల విషయంలో తల్లిదండ్రులు, విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. పరీక్ష ఫలితాల విషయంలో ఏ ఒక్క విద్యార్థికీ నష్టం జరుగనీయబోమని స్పష్టంచేశారు. ఫలితాల విషయంలో పొరపాట్లు జరిగినట్లు భావిస్తే రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్లకు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎలాంటి పొరపాట్లు జరిగినా సరిదిద్దుతామని మంత్రి చెప్పారు.
ఇంటర్ ఫలితాల పై విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్రెడ్డితోపాటు ఉన్నతాధికారులతో మంత్రి జగదీశ్రెడ్డి సమీక్షించారు. కొందరు అధికారులు అంతర్గత తగాదాలతో ఈ అపోహలు సృష్టించినట్టు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. ఫలితాల సమయంలో చోటుచేసుకున్న అపోహలను తొలిగించడానికి తెలంగాణ స్టేట్ టెక్నలాజికల్ సర్వీసెస్ (టీఎస్టీఎస్) ఎండీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో కమిటీ వేసినట్టు మంత్రి వెల్లడించారు. ఈ కమిటీ సత్వరమే దర్యాప్తుచేసి, మూడురోజుల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఈ కమిటీలో వెంకటేశ్వర్రావుతోపాటు హైదరాబాద్ బిట్స్ ప్రొఫెసర్ వాసన్, ఐఐటీ హైదరాబాద్ ప్రొఫెసర్ నిశాంత్ సభ్యులుగా ఉంటారని జగదీశ్రెడ్డి చెప్పారు.