ఆంధ్రప్రదేశ్ నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులతో తెలంగాణకు తీవ్ర నష్టం అని.. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని వెంటనే ఉపసంహరించుకోవాల్సిందిగా ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్లు రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. ఏపీ ఎత్తిపోతల పథకంపై కేంద్రం, అపెక్స్ కమిటీ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. ఏపీ ప్రాజెక్టులపై గ్రీన్ ట్రిబ్యునల్ను ఆశ్రయించగా స్టే వచ్చిందన్నారు. గ్రీన్ ట్రిబ్యునల్ స్టేను సైతం ధిక్కరించి ఏపీ ముందుకెళ్తుందన్నారు. దీంతో ఏపీ కోర్టు ధిక్కరణకు పాల్పడిందని కేసు వేసినట్లు చెప్పారు. వైఎస్సార్ తెలంగాణ ప్రజలకు తీరని ద్రోహం చేశారు. వైఎస్సార్ జలదోపిడీని అడ్డుకున్నామని కాంగ్రెస్ నేతలు చెప్పాలన్నారు. జలయజ్ఞం పేరుతో తెలంగాణ జలాలను ఏపీ దోపిడీ చేసిందని విమర్శించారు. జలదోపిడీపై కేసీఆర్ సహా పలువురు మాట్లాడితే అణచివేశారు. తెలంగాణను అడ్డుకోవడానికి వైఎస్సార్ చేయని కుట్రల్లేవు. రాజశేఖర్రెడ్డి కుట్రలకు ఆనాటి కాంగ్రెస్ నేతలే మద్దతిచ్చారు.
ఏపీ అక్రమాలపై తెలంగాణ ప్రజలంతా ఒక్కటిగా పోరాడాలని మంత్రి జగదీశ్రెడ్డి పిలుపునిచ్చారు. జాతీయ పార్టీలన్నీ తెలంగాణకు ద్రోహం చేసినవేనన్నారు. ఒక్క చుక్క నీటి బొట్టును కూడా ఆంధ్రాకు తీసుకుపోనివ్వమన్నారు. తెలంగాణకు అన్యాయం జరిగితే పోరాటం చేసే వారిలో కేసీఆర్ ముందుంటారని, ఏపీ అక్రమ ప్రాజెక్టుల నిర్మాణాలపై కేంద్రం జోక్యం చేసుకోవాలన్నారు. కోటి ఎకరాలు ఎలా సాగులోకి వచ్చాయో ప్రజలకు తెలుసన్నారు. ధాన్యం రికార్డు ఉత్పత్తి మాటలతో సాధ్యమయ్యే పనేనా? పాలమూరు వలసలు వాపస్ సంగతి గమనించడం లేదా అన్నారు. కాంగ్రెస్ హయాంలో సాగర్ కింద పదేళ్లలో మూడు పంటలు కూడా పండలేదు. అదే టీఆర్ఎస్ పాలనలో సాగర్ కింద 8 పంటలు పండినట్లు చెప్పారు.