గుంటూరు సిట్టింగ్ ఎంపీ గల్లా జయదేవ్ ఆడిటర్ గుర్రప్ప నాయుడి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభమైన సోదాలు రాత్రి వరకు కొనసాగుతూనే ఉన్నాయి. జయదేవ్ ఎన్నికల ఖర్చుల వివరాలను గుర్రప్ప నాయుడు రోజూ ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు అందిస్తున్నప్పటికీ సోదాలు నిర్వహించడంపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉద్దేశపూర్వకంగానే తమను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.
ఈ ఐటీ దాడులకు నిరసనగా గుంటూరులోని పట్టాభిపురంలో గల్లా జయదేవ్తో పాటు పలువురు అసెంబ్లీ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. కావాలనే తమను టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. కాగా, ఈ ఎన్నికల్లో గుంటూరు నుంచి మళ్లీ జయదేవ్ బరిలో నిలవగా, వైసీపీ నుంచి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, జనసేన నుంచి జయదేవ్ పాత స్నేహితుడు బోనబోయన శ్రీనివాస్ బరిలో ఉన్నారు.