ఈ తెల్లవారుజాము నుంచి టీడీపీ ఎంపీ సీఎం రమేశ్ ఇంటిలో పోలీసులు తనిఖీలు జరుగుతున్నాయి. ఎర్రగుంట్ల మండల పరిధిలోని పొట్లదుర్తిలోని ఆయన ఇంట్లోకి ప్రవేశించిన సుమారు 50 మంది, అన్ని గదుల్లోనూ సోదాలు చేస్తున్నారు. పోలీసులు సీఎం రమేశ్ పడకగదిని కూడా వదల్లేదని తెలుస్తోంది. సెర్చ్ వారంట్ కోసం అడిగిన సీఎం రమేశ్, వారంట్ లేకుండా ఎలా సోదాలు చేస్తారని పోలీసులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేయగా, ఎస్పీ ఆదేశాల మేరకు తాము వచ్చామని పోలీసులు వెల్లడించడం గమనార్హం.
తనపై రాజగీయ కక్షతోనే ఈ తరహా దాడులు చేయిస్తున్నారని రమేశ్ ఆరోపించారు. ఇంతవరకూ ఆయన ఇంట్లో ఏమీ లభ్యం కాలేదని తెలుస్తోంది. సీఎం రమేశ్ ఇంటితో పాటు ఆయన ప్రధాన అనుచరుల ఇళ్లలోనూ సోదాలు కొనసాగుతున్నాయి. కాగా, ఇటీవల ఈసీని కలిసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కడప ఎస్పీని బదిలీ చేయాలని కోరగా, కొత్త ఎస్పీని నియమించిన సంగతి విదితమే. రెండు రోజుల క్రితం పుట్టా సుధాకర్ యాదవ్ ఇంట్లో ఇదే తరహా దాడులు జరిగినప్పుడు సీఎం రమేశ్ ఆయనకు మద్దతుగా నిరసనకు దిగారు.
ఈ ఎన్నికల్లో కులం, డబ్బు ప్రభావం: నటి మాధవీలత