ఆదాయపు పన్ను శాఖ ఇటీవల సామాన్యులతో సహా అందరిపై కొరడా జులిపిస్తుంది. ఎవరు పన్ను ఎగవేసినా వారిపై భారీగా జరిమానా విధిస్తూ వస్తుంది ఈ శాఖ. తాజాగా టాలీవుడ్ లో అగ్రతారలపై ఈ జరిమానా కొరడా జులిపించిన విషయం తెలిసిందే. ఇప్పుడు యూపీఏ ఛైర్ పర్సన్ సోనియాగాంధీ, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీలకు ఆదాయపు పన్ను శాఖ నోటీసులు జారీ చేసింది.
వీరిరువురూ ఉద్దేశ పూర్వకంగా పన్ను ఎగవేశారని నోటీసులో పేర్కొంది. 2011-12 ఆర్థిక సంవత్సరానికి గాను వీరిద్దరూ రూ. 300 కోట్ల ఆదాయాన్ని తక్కువ చేసి చూపించారని తెలిపింది. ఆ సంవత్సరం రాహుల్ ఆదాయం రూ. 155 కోట్లు అయినప్పటికీ… రూ. 68 లక్షల ఆదాయాన్ని మాత్రమే చూపించి, ఆ మొత్తానికే పన్ను చెల్లించారని పేర్కొంది. రూ. 155.41 కోట్లకు సంబంధించి సోనియాగాంధీ… రూ. 155 కోట్లకు సంబంధించి రాహుల్ గాంధీలు జరిమానాతో కలిపి రూ. 100 కోట్లు చెల్లించాలని సూచించింది.