మాదాపూర్ ఐటీ గ్రిడ్స్ కంపెనీలో మంగళవారం మరోసారి సోదాలు కొనసాగిస్తున్నారు. పలు కీలక పత్రాలు, ల్యాప్టాప్లను తెలంగాణ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సెన్సిటివ్ డేటా ఐటీ గ్రిడ్స్ కంపెనీ చేతికి రావడం వెనుకున్న వ్యక్తుల పాత్రపై ఆరా తీస్తున్నారు. డేటా లీకేజీపై ఆయా ఆథారిటీలకు పోలీసులు లేఖలు రాయనున్నారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు కూడా లేఖ ద్వారా సమాచారమివ్వనున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల వ్యక్తిగత సమాచారం డేటా చోరీ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐటీ గ్రిడ్స్ డైరెక్టర్ అశోక్ కోసం సైబరాబాద్ పోలీసులు ముమ్మర గాలింపు చేపట్టారు.
బ్లూఫ్రాగ్ సంస్థతో ఐటీ గ్రిడ్స్ ఉన్న సంబంధం ఏమిటనే దానిపై కూడా పోలీసులు దృష్టి సారించారు. బ్లూఫ్రాగ్ సంస్థకు తాళాలు ఎందుకు పడ్డాయనే దానిపై ఆరా తీస్తున్నారు.ఏపీ పోలీసుల అధీనంలో అశోక్ ఉన్నట్లు తెలంగాణ పోలీసులు అనుమానిస్తున్నారు. రెండు పోలీసు బృందాలు ఏపీకి వెళ్లాయి. ఏపీ పోలీసుల అధీనంలో అశోక్ ఉన్నట్లు తెలంగాణ పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎఫ్ఎస్ఎల్ నివేదిక అనంతరం వివరాలు వెల్లడిస్తామని పోలీసులు స్పష్టం చేశారు.