ఇస్లామిక్ చట్టాలు అంటేనే కఠినంగా ఉంటాయి. వారి నిబంధనలు దాటిన వారికి శిక్షలు కాస్త సమసమాజాన్ని భయపెట్టేవిగానే ఉంటాయి. తాజాగా, వివాహం చేసుకోకుండా సహజీవనం చేస్తూ పట్టుబడిన ఐదు జంటలకు పోలీసులు బెత్తం దెబ్బలు రుచిచూపించారు. ఇస్లామిక్ చట్టం షరియాను కఠినంగా అమలు చేసే ముస్లిం మెజారిటీ దేశం ఇండోషియాలో ఈ సంఘటన చోటుచేసుకుంది.
పట్టుబడిన వారిలో నాలుగు జంటలు వివాహం కాకుండానే సాంఘిక జీవితం కొనసాగిస్తున్నారనీ…. మరో జంట వ్యక్తిగత ప్రదేశంలో ఏకాంతంగా గడుపుతూ పట్టుబడ్డారని పోలీసులు చెప్పినట్టు స్థానిక మీడియా పేర్కొంది. కొన్ని నెలల పాటు జైలు శిక్ష విధించిన అనంతరం వారిని ప్రావిన్షియల్ రాజధాని బండా ఎసెహ్కి తీసుకొచ్చారు. ఓ మసీదు ఆవరణంలో అందరి ముందు ఒక్కొక్కరిని బెత్తంతో 4 నుంచి 22 దెబ్బలు కొట్టి వదిలేశారు. కాగా డిసెంబర్లో ఇద్దరు యువకులు తక్కువ వయసు బాలికలతో గడిపినందుకు చెరో 100 బెత్తం దెబ్బలు కొట్టారు.