చంద్రశేఖర్ రావు ఇప్పుడుతెలంగాణా ప్రజల్ని తన మాటలతో ప్రభావితం చేస్తున్నారా ? కరీంనగర్, నిజామాబాదు బహిరంగ సభల్లో ఆయన మాట్లాడిన తీరు, జాతీయ స్థాయి పార్టీలపై చేసిన వ్యాఖ్యలు ఈ అనుమానాలకు బలం చేకూర్చుతున్నాయి. త్వరలో జాతీయ పార్టీ పెడతాను, ఢిల్లీ ని శాసిస్తాను అంటున్నాడు. తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలకు జాతీయ స్థాయి రాజకీయాలకు సంబంధం ఏమిటి అని చాలామంది ఆలోచిస్తున్నారు. తెలంగాలో తనకి 16 సీట్లు వస్తే, ఆంధ్ర లో తన సన్నిహితుడు, రాజకీయ స్నేహితుడు వై.ఎస్.ఆర్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి కి 20 సీట్లు పైనే వస్తాయని. అన్నీ కలిపితే 36 పార్లమెంట్ సభ్యులు తన కనుసన్నల్లో ఉంటారని, తద్వారా జాతీయ రాజకీయాలను శాసించ వచ్చని చంద్ర శేఖర్ రావు ఆలోచన. అందుకే తెలంగాణా ప్రజలకు పరోక్షంగా ఢిల్లీలో తానూ నిర్వహించబోయే పాత్ర గురించి వివరిస్తూ భారీ మెజార్టీతో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థులను గెలిపించమంటున్నాడు.
తెలంగాణ ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు ఇప్పుడు జాతీయ రాజకీయాల గురించి ఎక్కువగా మాట్లాడుతున్నాడు. రాష్ట్రాన్ని కుమారుడు తారక రామారావు కు అప్పగించి దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తీసుకొస్తానంటున్నాడు. ప్రస్తుతం అధికారంలో వున్న భారతీయ జనతా పార్టీ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో విఫలమైందని చెబుతున్నాడు. నరేంద్ర మోడీ ప్రధానిగా ఎం చేశాడో అందరికీ తెలుసునన్నారు. ఆయనపై ప్రజల్లో అసంతృప్తి ఉందని గుర్తు చేస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని కావాలని చేస్తున్న ప్రయత్నాలు ఫలియించవని ఆయనలు ఆ స్థాయి లేదని అంటున్నాడు.
వచ్చే ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ రెండు పార్టీలకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజార్టీ రాదనీ బల్లగుద్ది చెబుతున్నాడు. అందుకే జాతీయ స్థాయిలో ప్రత్యామ్న్యాయం కావాలని ఆశపడుతున్నాడు. త్వరలో జాతీయ పార్టీకి అంకురార్పణ చేస్తానని హామీ ఇస్తున్నాడు. దేశ సమస్యలపై తనకు ఎంత అవగాహన ఉందొ చంద్ర శేఖర్ రావు ప్రజలకు వివరిస్తున్నాడు. ఎవరు ఏమనుకున్నా, ఎన్ని విమర్శలు చేసినా తన నమ్మకం, విశ్వాసం వమ్ము కావంటున్నాడు. అందుకు నిదర్శనమే తెలంగాణ ఉద్యమం అని చెబుతున్నాడు. అయితే జాతీయ రాజకీయాలు చంద్ర శేఖర్ రావు అనుకున్నంత ఈజీ గా వుండవాణి ఆయనకు ఇంకా అర్ధం కాలేదు. మొన్న పుల్వామా ఘటన తరువాత మోడీ ప్రతిష్ట పెరిగింది. అలాగే రాహులా గాంధీ పై ప్రజల్లో సానుకూలత కనిపిస్తుంది. రాహుల్ కు తోడుగా ప్రియాంక కూడా క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చింది.
ఈ రెండు పార్టీలను కాదని మరో ప్రత్యామ్న్యాయం కోసం జనం ఎదురు చూడటం లేదు. చంద్ర శేఖర్ రావు ఆ మధ్య ఫెడరల్ ఫ్రంట్ అంటూ ఒడిస్సా వెళ్లి నవీన్ పట్నాయక్, కోల్ కత్తా లో మమతా బెనర్జీ, బెంగళూరు, లో దేవా గౌడ, చెన్నై వెళ్లి కరుణానిధి, స్టాలిన్ ను కలసి వచ్చాడు. ఆయా నాయకుల మద్దతు కూడగట్టాలని ప్రయత్నం చేశాడు. కానీ కేసీఆర్ ఆశించిన విధంగా వారి నుంచి స్పందన రాలేదు. మరి ఇప్పుడు ఏ ధైర్యం తో చంద్ర శేఖర్ రావు ఫెడరల్ ఫ్రంట్ అంటూ అడుగులు వేస్తున్నాడు?
కేసీఆర్ మనసులో ఏముంది ? దేశానికి ప్రధాని కావాలనుకుంటున్నాడా ?
జాతీయ ప్రత్యామ్న్యాయం అని రాజకీయ ప్రయోజనం ఆశిస్తున్నాడా ?
ఏమిటి కేసీఆర్ రాజకీయం ?
-భగీరథ