అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇరాన్ నుంచి ముడి చమురు దిగుమతి చేసుకునే ఏ దేశానికి ఇక నుంచి మినహాయింపులు ఇవ్వబోమని కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీని తో ఇరాన్ నుంచి భారత్ ముడి చమురు దిగుమతులను నిలిపివేయనుంది. ట్రంప్ ఆంక్షల వల్ల అత్యధికంగా ఇబ్బంది పడే దేశాల్లో చైనా తర్వాత మనమే ఉంటాం. ఎందుకంటే ముడి చమురు దిగుమతుల్లో భారత్ రెండో స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం సౌదీ అరేబియా వద్ద ఉన్న మిగులు చమురు నిల్వలను కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తోందని అధికార వర్గాలు తెలిపాయి.
మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి(2018-19) 24 మిలియన్ టన్నుల ముడి చమురును భారత్ దిగుమతి చేసుకుంది. కాగా, అమెరికా ఆంక్షల నేపథ్యంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ట్వీట్ చేశారు ‘ఇండియన్ రిఫైనరీలకు సరిపడినంత ముడి చమురును అందించడానికి మా వద్ద తగిన ప్రణాళిక ఉంది. చమురును ఉత్పత్తి చేస్తున్న ఇతర దేశాల నుంచి ఆ మొత్తాన్ని దిగుమతి చేసుకుంటాం. దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్కు ఉన్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని ఇండియన్ రిఫైనరీలు అన్నింటికీ సిద్ధంగా ఉన్నాయి’ అని పేర్కొన్నారు. మే నుంచి రాయితీలు ఎత్తివేస్తే ఎలాంటి చర్యలు తీసుకోవాలో అందుకు సంబంధించిన ప్రణాళికతోసైతం సిద్ధంగా ఉన్నామని పెట్రోలియంశాఖ కూడా ప్రకటించింది.
అమెరికా ఇరాన్పై ఆంక్షలు విధించిన తర్వాత భారత్తో సహా ఏడు దేశాలకు ఆరునెలల పాటు మినహాయింపులు ఇచ్చింది. మే 2వ తేదీతో ఈ గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో ఇక మినహాయింపులు ఇవ్వబోమని ట్రంప్ ప్రకటించారు. ఇరాన్ నుంచి భారత్ మినహాయింపులు పొందడానికి నెలకు 1.25 మిలియన్ టన్నుల ముడి చమురును దిగుమతి చేసుకోవాల్సి ఉండగా, 2018-19 ఆర్థిక సంవత్సర కాలంలో ఏకంగా 24మిలియన్ టన్నులు దిగుమతి చేసుకుంది. 2017-18లో ఇది 22.6 మిలియన్ టన్నులుగా ఉంది. భారత రిఫైనరీలు ముడి చమురును దిగుమతి చేసుకునేందుకు పెద్ద స్థాయిలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకున్నాయని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ) ఛైర్మన్ సంజీవ్ సింగ్ తెలిపారు. ఇరాన్ నుంచి దిగుమతి చేసుకోకపోవడం ద్వారా ఏర్పడే లోటును భర్తీ చేయడానికి ఇతర దేశాలతో చేసుకున్న ఒప్పందాల ద్వారా భర్తీ చేస్తామని తెలిపారు.
మెక్సికో నుంచి 0.7మిలియన్ టన్నులు, సౌదీ అరేబియా నుంచి 2 మిలియన్ టన్నులు, కువైట్ నుంచి 1.5మిలియన్ టన్నులు, యూఏఈ నుంచి మరో మిలియన్ టన్ను ముడి చమురును ఈ ఏడాదిలో దిగుమతి చేసుకోవచ్చు. ‘ఆయిల్ దిగుమతికి సంబంధించి ఇప్పటికే ఒప్పందాలు కుదిరాయి. అంతర్జాతీయంగా ముడి చమురు సులభంగానే లభిస్తుంది. ఈ స్థితి ధరలపై ఎంత ప్రభావం చూపుతుందనే మాత్రం ఇప్పుడే చెప్పలేను’ అని సంజీవ్ సింగ్ అభిప్రాయపడ్డారు.