ఇరాన్ రాజధాని టెహ్రాన్లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.1గా నమోదైంది. గత అర్ధరాత్రి దాటిన తర్వాత 1:30 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి రోడ్డుపైకి వచ్చి పరుగులు తీశారు. సురక్షిత ప్రాంతాలకు వెళ్ళేందుకు ప్రయత్నించారు.
భూకంపం నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఒకరు మరణించారు. మరో ఏడుగురు గాయపడినట్టు ఆ దేశ వైద్య శాఖ అధికారి ప్రతినిధి కియానుష్ జహాన్పూర్ తెలిపారు. టెహ్రాన్కు ఈశాన్యంగా దమావాండ్ ప్రాంతంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూమికి పది కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్టు అమెరికా జియోలాజికల్ సర్వే పేర్కొంది.