ఇటీవల సీబీఐ లో కూడా అనేక లుకలుకలు బయటపడిన విషయం తెలిసిందే. దానితో ఒకరిపై ఒకరు కేసు లు వేసుకున్నారు. అయితే తాజాగా ఆ కేసులపై విచారణ జరగగా, సీబీఐ ప్రత్యేక డైరెక్టర్ రాకేశ్ అస్థానాకు దిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. అవినీతి ఆరోపణల వ్యవహారంలో తనపై కేసును కొట్టివేయాలంటూ అస్థానా వేసిన పిటిషన్ను న్యాయస్థానం కొట్టిపారేసింది. ఈ కేసులో దర్యాప్తు జరపాల్సిందేనని, 10 వారాల్లోగా ఈ దర్యాప్తు పూర్తి చేయాలని సీబీఐని ఆదేశించింది. మాంసం ఎగుమతిదారు మొయిన్ ఖురేషీ కేసులో తనను తప్పించేందుకు ఓ మధ్యవర్తి ద్వారా రాకేశ్ అస్థానాకు తాను లంచం ఇచ్చినట్లు హైదరాబాద్కు చెందిన వ్యాపారవేత్త సతీశ్ బాబు చెప్పడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీనితో రాకేశ్ అస్థానా, సీబీఐ డిప్యూటీ ఎస్పీ దేవేందర్ కుమార్, మధ్యవర్తి మనోజ్ ప్రసాద్లపై ఎఫ్ఐఆర్ నమోదైంది.
దీన్ని సవాల్ చేస్తూ వీరు దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం అస్థానా, మిగతా ఇద్దరిపై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టేసేందుకు తిరస్కరించింది. ఈ కేసులో 10 వారాల్లోగా దర్యాప్తు పూర్తిచేయాలని సీబీఐని ఆదేశించింది. అంతేగాక.. అస్థానాపై క్రిమినల్ దర్యాప్తు చేపట్టకుండా గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను కూడా న్యాయస్థానం రద్దు చేసింది. ఈ కేసులో అస్థానాను అరెస్టు చేసే అవకాశముంది.