కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొంది. అందుబాటులో ఉన్న మానవ వనరులను సమర్థంగా వినియోగించుకోవాలని సర్కారు భావిస్తోంది. విజయవాడలో ఉన్న కొవిడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో పోస్టు గ్రాడ్యుయేట్లు, మేనేజ్ మెంట్ గ్రాడ్యుయేట్ల సేవలు ఉపయోగించుకునేందుకు ప్రణాళిక రూపొందించింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఇంటర్న్ షిప్ ప్రకటన విడుదల చేసింది.
కంట్రోల్ సెంటర్ లో పనిచేసేందుకు ఆసక్తి కలిగిన మేనేజ్ మెంట్ గ్రాడ్యుయేట్లు, పోస్టుగ్రాడ్యుయేట్లు వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరు కావొచ్చని ఆ ప్రకటనలో వెల్లడించింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైనవారు మూడు నెలల పాటు పనిచేయాల్సి ఉంటుంది. నెలకు రూ.6 వేల చొప్పున గౌరవవేతనం చెల్లిస్తారు. ఇంటర్న్ షిప్ ను విజయవంతంగా పూర్తిచేసినవారికి ఓ సర్టిఫికెట్ కూడా ఇస్తారు.
దరఖాస్తులు సమర్పించేందుకు ఈ నెల 22 తుది గడువు. అభ్యర్థులకు బేసిక్ కంప్యూటర్ స్కిల్స్, విశ్లేషణ సామర్థ్యం, భావవ్యక్తీకరణ నైపుణ్యాలు, సాఫ్ట్ స్కిల్స్ ఉండాలి. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు విజయవాడ ఎంజీ రోడ్ లోని న్యూ ఆర్ అండ్ బి బిల్డింగ్ లో ఉన్న స్టేట్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కు ఉద్యోగార్థులు నేరుగా రావొచ్చని ప్రకటనలో పేర్కొన్నారు.