ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన చింతకింది మల్లేశం జీవితగాధ ఆధారంగా తెరకెక్కిన చిత్రం “మల్లేశం”. ఇప్పటి వరకు కమెడియన్ గా మెప్పించిన ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించారు. చేనేత రంగంలో మల్లేశం చేసిన కృషికి భారత ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ అవార్డును ఇచ్చి సత్కరించడమే కాకుండా చేనేత పరిశ్రమ అభివృద్ధిలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం కూడా చేనేత యూనిట్ డెవలప్మెంట్ కోసం మల్లేశంకు కోటి రూపాయలను ప్రకటించింది. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది. ఈ చిత్రంలో ప్రియదర్శి నటనకు విమర్శకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఒక ఆసక్తికర విషయాన్నీ బయటపెట్టారు దర్శకుడు. దర్శకుడు రాజ్ ఆర్ మాట్లాడుతూ “చింతకింది మల్లేశం గారి గురించి తెలుసుకున్నాక, ఆయనను కలుసుకుని నా ఆలోచనను చెప్పాను. ఆయన నుంచి అనుమతి తీసుకుని స్క్రిప్ట్ ను సిద్ధం చేసుకున్నాను. “మల్లేశం” పాత్రకి నానీగానీ, విజయ్ దేవరకొండగాని అయితే బాగుంటుందనే ఉద్దేశంతో ప్రయత్నాలు చేశాను. మరో మూడేళ్ల వరకూ వాళ్ల కాల్షీట్స్ లేవని తెలిసింది. ఆ సమయంలోనే ప్రియదర్శి పేరు వినిపించింది. దాంతో ఆయనతో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాను. అంతా సిద్ధం చేసుకున్న తరువాత నేనే దర్శకత్వం చేయడం మంచిదనే భావన వచ్చింది. దాంతో నేనే రంగంలోకి దిగాను .. ఇప్పుడు ఈ సినిమాకి వస్తోన్న రెస్పాన్స్ ఆనందాన్ని కలిగిస్తోంది” అని చెప్పుకొచ్చాడు.