భారత్-పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పాకిస్తాన్ సరిహద్దులో ఉన్న రాష్ట్రాల్లో భారత్ వాయుసేన యుద్ధ విమానాలు మోహరించింది. పాక్ సరిహద్దు సమీపంలో ఉన్న జమ్మూకశ్మీర్, పంజాబ్ రాష్ట్రాల్లో వైమానిక దళ యుద్ధ విమానాలను మోహరించింది. ఈ విమానాలు గురువారం రాత్రి విన్యాసాలు చేశాయి. దీంతో సరిహద్దు ప్రాంతాల ప్రజలు ఏం జరుగుతోందోనని భయాందోళనలకు గురయ్యారు.
పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా గత నెల 26న భారత వాయుసేన పాకిస్తాన్లోని బాలాకోట్ కేంద్రంగా ఉన్న జైషే మొహమ్మద్ ఉగ్రవాద స్థావరంపై దాడులు జరిపింది. దీనికి ప్రతీకారంగా పాక్ యుద్ధ విమానాలు భారత వైమానిక స్థావరాలపై దాడులకు ప్రయత్నించింది. వెంటనే అప్రమత్తమైన ఐఏఎఫ్ పాక్ దాడిని తిప్పికొట్టిన సంగతి తెలిసిందే. గురువారం పాక్ బార్డర్ లో భారత్ యుద్ద విమానాల మోహరింపుతో సరిహద్దు ప్రాంతాల ప్రజలు జంకుతున్నారు.