భారత్ మరోమారు పాక్ సైన్యానికి బుద్ధి చెప్పింది. పాక్ కమాండో ఆపరేషన్ను భగ్నం చేసిన భారత సైన్యం ఏడుగురిని హతమార్చింది. ఆ దేశానికి చెందిన బోర్డర్ యాక్షన్ టీమ్ (బ్యాట్) సరిహద్దు వెంట కాల్పులకు తెగబడుతూ ఉగ్రవాదులను సరిహద్దు దాటించే ప్రయత్నం చేసింది. పాక్ పన్నాగాన్ని ముందే పసిగట్టిన భారత్ జరిపిన ఎదురు కాల్పుల్లో ఏడుగురు ఉగ్రవాదులు హతమయ్యారు.
ఈ ఘటనలో మృతి చెందిన వారందరు జైషే ఉగ్రవాదులు కానీ, పాక్ ఆర్మీకి చెందిన స్పెషల్ సర్వీస్ గ్రూప్ సభ్యులు అయి ఉంటారని అధికారులు తెలిపారు. కాల్పులు అనంతరం పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లో నాలుగు మృతదేహాలను గుర్తించినట్టు పేర్కొన్నారు. కాల్పులు ఇంకా కొనసాగుతుండడంతో మృతదేహాలు అక్కడే అలాగే పడి ఉన్నాయని తెలిపారు.