న్యూజీలాండ్-భారత్ టీ20 సిరీస్ తొలి మ్యాచ్లో ఆతిథ్య జట్టు టీమిండియా ముందు 220 పరుగుల టార్గెట్ ఉంచింది. బదులుగా బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు మాత్రం 18 పరుగులకే కెప్టెన్ రోహిత్ శర్మ వికెట్ కోల్పోయింది. ఒక్క పరుగు చేసిన రోహిత్ సౌథీ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. మొదటి నుంచి వేగంగా ఆడిన శిఖర్ ధవన్ జట్టు స్కోరు 51 దగ్గర అవుట్ అయ్యాడు. 29 పరుగులు చేసి ఫెర్గూసన్ బంతికి బౌల్డ్ అయ్యాడు.
ధవన్ 3 సిక్సర్లు, 2 ఫోర్లు కొట్టాడు. తర్వాత రిషబ్ పంత్, విజయ్ శంకర్ ఒకే ఓవర్లో అవుట్ అవడంతో జట్టు కష్టాల్లో పడింది. జట్టు స్కోరు 64 పరుగుల దగ్గర పంత్(4), మరో పరుగు తర్వాత విజయ్ శంకర్(27) శాంట్నర్ బౌలింగ్లో అవుటయ్యారు. దినేష్ కార్తీక్, హార్దిక్ పాండ్య కూడా సింగిల్ స్కోరుకే అవుటయ్యి నిరాశపరిచారు. కార్తీక్(5), హార్దిక్ పాండ్య(4) ఇద్దరూ సౌథీ బౌలింగ్లో అవుట్ అయ్యారు. నిర్ణిత ఓవర్లలో భారతజట్టు లక్ష్యాన్ని చేరేట్టుగా కనిపించడంలేదు. ఇప్పటికే కివీస్ విజయం ఖరారైనట్టే. తాజా సమాచారం ప్రకారం 17 ఓవర్లలో 120 పరుగులు చేసిన భారత్, 7 వికెట్లు కోల్పోయింది. అప్పుడప్పుడు ఓటమి ఎదురైతేనే ఓవర్ కాంఫిడెన్స్ సరైన స్థాయిలోకి వస్తుంది.