ప్రపంచ వ్యాప్తంగా మూడున్నర లక్షల మందికి కరోనా వైరస్ సోకింది. ఈ మహమ్మారితో పలు దేశాల్లో సుమారు 14 వేల మంది మరణించారు. మన దేశం కూడా ఈ మహమ్మారిని అరికట్టేందుకు కేంద్రం అన్ని చర్యలు తీసుకున్నది. దాదాపు అన్ని రాష్ట్రాలు లాక్డౌన్ ప్రకటించాయి. కరోనాపై మీడియా సమావేశం నిర్వహించిన డబ్ల్యూహెచ్వో ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ మైఖేల్ ర్యాన్ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్ లాంటి మహమ్మారిని ఎదుర్కొనే సామర్థ్యం భారత్కు ఉందని ఆయన అన్నారు.
గతంలో రెండు సార్లు ఇలాంటి మహా విపత్కర పరిస్థితుల నుంచి భారత్ బయటపడినట్లు ఆయన తెలిపారు. మశూచీ లేదా అమ్మవారు, పోలియో సోకిన సమయంలో భారత్ చూపించిన తెగువను ఆయన మెచ్చుకున్నారు. వైరస్ గురించి పరీక్షించేందుకు చాలా వరకు పరిశోధనశాలలు అవసరమని అన్నారు. పోలియో నివారణలో భారత్ విజయం సాధించిందని, ఇప్పుడు కూడా కరోనాను ఎదుర్కొనే సత్తా భారత్కు ఉందని ర్యాన్ తెలిపారు.