భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ 73వ స్వాత్రంత్య దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. భరతమాత బిడ్డలందరికీ నేడు సంతోషకరమైన రోజు అని అన్నారు. స్వాతంత్ర్య సమరయోధులను కృతజ్ఞతాపూర్వకంగా స్మరించుకుందామని అన్నారు. దేశ స్వాతంత్ర్యం సాధించేందుకు ప్రాణత్యాగాలు చేసి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. ఈ ఏడాది అక్టోబర్ 2 నాటికి జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతిని జరుపుకోబోతున్నామని చెప్పారు.గాంధీ మార్గం మనకు నేటికీ ఆచరణీయమని, నేడు మనం అవలంబించే అనేక విధానాలు ఆయన ఆలోచనా విధానాల్లో నుంచి పుట్టినవేనని అన్నారు.
నేడు ప్రజా సంక్షేమం కోసం తీసుకొచ్చిన అనేక విధానాల వల్ల దేశ ప్రజల జీవనం మెరుగవుతోందన్నారు. ఈరోజు మనందరి లక్ష్యం దేశాభివృద్ధి అని పేర్కొన్నారు. 130 కోట్ల మంది ప్రజలు తమలో ఉన్న నైపుణ్యాలను వెలికితీయాలని అన్నారు.జమ్మూకశ్మీర్, లడఖ్ పై తీసుకున్న నిర్ణయాల వల్ల ఆ ప్రాంత ప్రజలు అధిక ప్రయోజనాలు పొందుతారన్న విశ్వాసం నాకు ఉందన్నారు. జమ్మూకశ్మీర్, లడఖ్ ప్రజలు ఇక నుంచి ఇతర ప్రాంతాలతో సమానంగా హక్కులు పొందగల్గుతారని పేర్కొన్నారు.