పాకిస్థాన్ కు అంతర్జాతీయ వేదికలపై పలు ఎదురుదెబ్బలు తగిలినప్పటికీ తమ మేకపోతు గాంభీర్యాన్ని వీడడం లేదు. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషన్ సమావేశంలో తమకు 58 దేశాలు మద్దతు పలికాయని ఇమ్రాన్ ఖాన్ గొప్పగా చెప్పుకోవడం తెలిసిందే. అయితే దీనిపై భారత విదేశాంగ శాఖ ఘాటుగా జవాబిచ్చింది.
భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ స్పందిస్తూ ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషన్ లో ఉన్నదే 47 సభ్య దేశాలని, పాక్ కు మద్దతు ఇస్తున్న దేశాలు ఏవో తమకు తెలియడంలేదని వ్యంగ్యస్త్రాలు సంధించారు. వీలైతే ఆ 58 దేశాల జాబితా ఇవ్వాలంటూ పాకిస్థాన్ కు చురక అంటించారు. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషన్ సమావేశం వివరాలు అందరికీ తెలుసని, కానీ పాకిస్థాన్ తక్కిన ప్రపంచానికి కొత్త విషయాలు చెబుతోందని విమర్శించారు.