ధర్మో రక్షతిః రక్షితః..అన్నట్టే, చెట్టును మనం కాపాడితే ఆ చెట్టు మనల్ని కాపాడుతాయి. మనిషి లేకపోయినా చెట్లు, నీరు, గాలి తదితరాలతో నిండి ఉన్నా ప్రకృతికి ఏమీ కాదు. కానీ ప్రకృతి లేకుంటే మానవ మనుగడే ప్రశ్నార్థకమవుతుంది. అందుకే ప్రకృతిని సంరక్షించుకోవడం ప్రతి మనిషి బాధ్యత. దీనికి ధనిక, పేదలన్న తారతమ్యం లేదు. అందుకే ప్రకృతి పరిరక్షణ అందరి బాధ్యత. ఆ బాధ్యతను ఓ ఆటో డ్రైవర్ గుర్తు చేసి ప్రకృతి ప్రేమికుల మనుసును దోచుకున్నాడు. మండే ఎండలకు కాసేపు నీడన ఉందామంటే చెట్లు కనిపించడం లేదు. ఉక్కపోతతో సతమతమవుతున్న జనానికి ఉపశమనం కలిగిస్తూ.. చెట్లను కాపాడండి.. ప్రాణాలను కాపాడండి.. అంటూ సందేశం ఇస్తున్నాడు, కలకత్తాకు చెందిన ఓ ఆటో డ్రైవర్. బిజయ్ పాల్ అనే ఆటో డ్రైవర్.. తన ఆటోను పూర్తిగా ఆకుపచ్చగా మార్చేశాడు. ఆటో చుట్టూ పచ్చటి కవర్ను ఏర్పాటు చేసుకోగా.. దానిపై ఏకంగా పచ్చటి గడ్డిని పెంచేశాడు.
గడ్డి ఒక్కటే కాదు.. చిన్న మొక్కలు, పొదలను కూడా పెంచాడు. ఎందుకంటే ఎండ నుంచి కాస్త ఉపశమనం పొందేందుకు. దానితో పాటు చెట్లను పెంచడం వల్ల జరిగే లాభాలు తెలుసుకునేందుకు మొక్కలను పెంచాడు. అంతేకాదు పర్యావరణానికి హానీ కలగకుండా.. ఆటోను కూడా ఎల్పీజీ గ్యాస్తో నడుపుతున్నాడు. ఆకుపచ్చ గార్డెన్ కింద..చెట్లను కాపాడండి.. ప్రాణాలను కాపాడండి అని బెంగాలీ భాషలో రాయించాడు. తన ఆటోను చూసైనా.. జనాల్లో మార్పు వచ్చి.. పర్యావరణం దెబ్బతినకుండా మొక్కలను నాటి, చెట్లను కాపాడుతారేమోననే భావనతో ఈ చిన్న ప్రయత్నం చేస్తున్నానని ఆటో డ్రైవర్ తెలిపాడు. మనసు ఉంటె మార్గం అదే కనిపిస్తుంది అనేదానికి ఇదో చక్కటి ఉదాహరణ.