ఏపీ సీఎం గా జగన్ పదవీబాధ్యతలు స్వీకరించిన తర్వాత పాలన పై వేగం పెంచారు. రాష్ట్రంలోని వివిధ శాఖల అధికారులకు స్థానచలనం కలుగుతోంది. భారీ సంఖ్యలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు కొనసాగుతున్నాయి. చంద్రబాబు హయాంలో కీలకపదవుల్లో ఉన్న అధికారులకు స్థాన చలనం తప్పలేదు.
ఐఏఎస్ అధికారి రాజశేఖర్ ను వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శిగా కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీఅయ్యాయి.పాఠశాల విద్యాశాఖ కార్యదర్శిగా శశిభూషణ్ ను నియమించిన సర్కారు, విశాఖ రేంజ్ డీఐజీ పాలరాజు ను పోలీసు హెడ్ క్వార్టర్స్ కు బదిలీ చేసింది. విశాఖ డీసీపీ-1 విక్రాంత్ పాటిల్ ను కూడా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో రిపోర్ట్ చేయాలంటూ ఆదేశాలు అందాయి.
సీనియర్ ఐఏఎస్ అధికారి, వైద్యఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్యకు కూడా బదిలీ తప్పలేదు. పూనం మాలకొండయ్యను రాష్ట్ర పశుసంవర్ధకశాఖ కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇంతకుముందు ఆమెను వ్యవసాయశాఖకు బదిలీ చేస్తున్నట్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో మార్పులు చేశారు.