కరోనా కాటుకు అమెరికా అల్లాడుతున్ననేపథ్యంలో ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ ను ఔషధాలు పంపాలని కోరారు. అందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికాకు భారత్ హైడ్రాక్సీక్లోరోక్విన్ను పంపింది. ఆ డ్రగ్స్తో పాటు ఇతర ప్రాణాధార ఔషధాలు కూడా ప్రత్యేక కార్గో విమానంలో నిన్న సాయంత్రం న్యూజెర్సీలోని నెవార్క్ అంతర్జాతీయ విమానానికి చేరుకున్నాయి. ఈ విషయంపై అమెరికాలోని భారత రాయబార కార్యాలయం ప్రకటన చేసింది.
అమెరికా అధ్యక్షుడి వినతి మేరకు 35.82 లక్షల హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలను పంపుతామని ఇటీవలే భారత్ ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే, వీటితో పాటు పలు ఔషధాలను పంపుతామని భారత్ తెలిపింది. ‘కొవిడ్-19పై పోరులో మన భాగస్వామ్య దేశానికి సాయం చేయడానికి భారత్ నుంచి న్యూజెర్సీలోని నెవార్క్ విమానాశ్రయానికి చేరుకున్నాయని అమెరికాలో భారత రాయబారి తరాంజిత్ సింగ్ సంధు ట్వీట్ చేశారు.
కాగా, అమెరికాలో ఇప్పటివరకు 5,33,259 మందికి కరోనా వైరస్ సోకింది. ఇప్పటివరకు ఆ దేశంలో 20,597 మంది మృతి చెందారు. మొదట హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఎగుమతులపై నిషేధం విధించిన భారత్ ఆ తర్వాత దాన్ని పాక్షికంగా ఎత్తేసింది. ఇప్పటికే పలు దేశాలకు భారత్ సాయం చేసింది. ఈ డ్రగ్స్ వల్ల కరోనాకు కూడా చికిత్స అందించవచ్చని కొందరు వైద్య నిపుణులు చెబుతుండడంతో వీటికి డిమాండ్ పెరిగింది.