పబ్ జీ గేమ్.. ప్రపంచవ్యాప్తంగా పిల్లలు, యువతకు పిచ్చెక్కిస్తున్న సంగతి తెలిసిందే. దీని బారిన పడి యువత, పిల్లలు ప్రాణాలు కోల్పోతుండటంతో ఇటీవల సంస్థ ఈ గేమ్ ఆడేందుకు సమయం కుదించింది. కొన్ని రాష్ట్రాలలో ఏకంగా నిషేదించారు కూడా. కానీ తెలుగు రాష్ట్రాలలో అలాంటి నిర్ణయాలు ఇంకా తీసుకోకపోవటంతో ఇక్కడ మరణాలు ఎక్కువ అవుతున్నాయి. తాజాగా, హైదరాబాద్లో ఓ బాలుడిని పబ్ జీ గేమ్ బలిగొంది. సెల్ ఫోన్లో ‘పబ్జీ’ గేమ్ ఆడొద్దని తల్లి మందలించడంతో 10వ తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన మల్కాజిగిరి పోలీస్స్టేషన్లో పరిధిలో జరిగింది.
పోలీసుల వివరాల ప్రకారం విష్ణుపురి కాలనీకి చెందిన దంపతులకు కుమారుడు సాంబశివ పబ్జీ గేమ్ ఆడుతూ చదవును నిర్లక్ష్యం చేస్తున్నాడు. దీంతో గేమ్ ఆడితే చదువులో వెనుకబడిపోతావని, ఆట మానేస్తే మంచి మార్కులు సాధిస్తావని తల్లి పలుసార్లు మందలించింది. ఇక 10వ తరగతి పరీక్ష రాసేది ఉందని పబ్జీ గేమ్ ఆడొద్దని కొడుకును మరోసారి మందలించింది తల్లి.
దీనితో కలత చెంది ఆవేశంతో బెడ్రూమ్లోకి వెళ్లి మెడకు టవల్తో బిగించుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కిటికి నుంచి తల్లి చూడగా సాంబశివ కిందపడిపోయినట్లు కనిపించాడు. ఎంత పిలిచినా డోర్ తీయకపోవడంతో అనుమానం వచ్చి స్థానికుల సహాయంతో డోర్ను పగులగొట్టి చూడగా… మంచంపై సాంబశివ మృతి చెందినట్లు కనిపించాడు. దీనితో షాక్కు గురైన కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. ఇలా రోజురోజుకూ పబ్ జీ బారిన పడి, విద్యార్థులు, యువత ప్రాణాలు తీసుకోవడం ఆందోళనకలిగిస్తోంది.