హైదరాబాదులో చలి తీవ్రత పెరగడంతో స్వైన్ ఫ్లూ వ్యాప్తి చెందుతోంది. నగరంలో కేవలం పదిరోజుల్లో 83 మందికి స్వైన్ ఫ్లూ సోకిందని వైద్యాధికారుల పరీక్షల్లో తేలింది. హైదరాబాద్ నగరంలోని పలు ప్రభుత్వ ఆసుపత్రులకు స్వైన్ ఫ్లూతో పలువురు రోగులు చేరారు. సాధారణంగా నల్లకుంటలోని ఫీవర్ ఆసుపత్రికి రోజుకు సగటున 500 రోగులు అనారోగ్యంతో వస్తుంటారు. కాని చలి తీవ్రత పెరగడంతో రోజుకు వెయ్యిమంది రోగులు ఫీవర్ ఆసుపత్రికి వస్తున్నారని వైద్యులు చెప్పారు.
ఉష్ణోగ్రత తగ్గడం వల్ల వైరస్ విజృంభించిందని వైద్యులు చెప్పారు. జనవరి 1వతేదీ నుంచి పదోతేదీ వరకు 483 మంది రక్త నమూనాలను పరీక్షించగా వీరిలో 83 మందికి స్వైన్ ఫ్లూ సోకినట్టు నిర్ధారణ అయిందని చెప్పారు. స్వైన్ ఫ్లూ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచించారు.