telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ

ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీస్ స్టేషన్ వద్ద విద్యార్థులు అనుమతి పత్రాల కోసం పడిగాపులు

hyderabad-police-gives-permission-to-hostellers-for-going-to-their-villages

దేశం మొత్తం లాక్‌డౌన్‌ అయిన నేపథ్యంలో హైదరాబాద్‌ హాస్టళ్లను ఖాళీ చేయాలంటూ నిర్వాహకులు ఒత్తిడి తీసుకురావడంపై విద్యార్థులు ఆందోళన చేస్తున్న విద్యార్థులకు ఊరట లభించింది. అమీర్‌పేట, పంజగుట్ట ప్రాంతాల్లో ఉంటున్న హాస్టళ్లను ఖాళీ చేయాలంటూ నిర్వాహకులు ఒత్తిడి చేయడంతో యువతీ యువకులు బుధవారం ఆందోళనకు దిగారు. అమీర్‌పేట, పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌ ఎదుట ఆందోళన చేపట్టారు.

హాస్టళ్లలో ఉండేందుకు అనుమతి లేకపోతే తమ ఇళ్లకు వెళ్లిపోవడానికి అనుమతివ్వాలంటూ వారంతా పోలీసులను ఆశ్రయించారు. దీంతో వారు ఎలాంటి ఆటంకం లేకుండా స్వగ్రామలకు వెళ్లేలా పోలీసులు పాస్‌లు జారీ చేశారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో చెక్‌పోస్ట్‌ల వద్ద ఎలాంటి ఆటంకం లేకుండా విద్యార్థులు, ఉద్యోగులు తమ తమ స్వస్థలాలకు వెళ్లేలా పాస్‌లు మంజూరు చేసినట్లు డీసీపీ శ్రీనివాస్‌ తెలిపారు. ఈ పాస్‌లకు కేవలం 24 గంటలు మాత్రమే అనుమతి ఉంటుందని, అప్పటి లోపు ఇళ్లకు చేరుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.

కాగా, ఎస్‌ఆర్‌ నగర్‌ వద్ద విద్యార్థులు తమకు అనుమతి పత్రాలు ఇవ్వాలంటూ గుంపులు గుంపులుగా రావడంతో పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి పత్రాల కోసం హాస్టల్‌ ఓనర్‌ నుంచి లెటర్‌ తీసుకురావాలని, వారిని తిరిగి హాస్టళ్లకు పంపించారు. కాగా, వీరిలో ఎక్కువ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థులు, ఉద్యోగులు ఉన్నట్లు తెలుస్తోంది.

Related posts