హైదరాబాద్ హైటెక్ సిటీ, నాగోల్ మార్గంలో పీక్ టైమ్ లో ప్రతి మూడు నిమిషాలకో రైలును తిప్పుతామని మెట్రో రైల్ అధికారులు తెలిపారు. నాన్ పీక్ అవర్స్ లో ఐదు నిమిషాలకో మెట్రో ఉంటుందని తెలిపారు. దీంతో మాదాపూర్, కొండాపూర్, హైటెక్ సిటీ తదితర ప్రాంతాల్లోని ఐటీ కంపెనీల్లో పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగులకు మెట్రో ప్రయాణం మరింత సులభతరం కానుంది.
ఇటీవలి కాలం వరకూ హైటెక్ సిటీ మార్గంలో రివర్సల్ సదుపాయం లేకపోవడంతో రైళ్లు కాస్తంత ఆలస్యంగా నడిచాయని, ఇప్పుడా సదుపాయం కూడా అందుబాటులోకి వచ్చిందని అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ మార్గంలో సగటున 5 నుంచి 6 వేల మంది వరకూ ప్రయాణికుల సంఖ్య పెరుగుతోందని, గత బుధవారం ఏకంగా 3.06 లక్షల మంది ప్రయాణించారని హెచ్ఎంఆర్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు.