హైదరాబాద్ నగరంలోని గోల్కొండలో రౌడీ షీటర్ చాందీ షేక్ మహ్మద్ దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసుల కథనం ప్రకారం.. రౌడీషీటర్ చాందీ షేక్ మహ్మద్, అతడి స్నేహితుడైన చికెన్ సెంటర్ యజమాని ఫయాజుద్దీన్లు రాత్రి 10 గంటల సమయంలో ఎండీ లైన్స్ నుంచి గోల్కొండకు బైక్పై వెళ్తున్నారు. గమనించిన ప్రత్యర్థులు క్వాలిస్ వాహనంలో వారిని వెంబడించి మొరైన్ బేకరీ సమీపంలో బైక్ను ఢీకొట్టారు.
రోడ్డుపై పడిపోయిన షేక్ మహ్మద్, ఫయాజుద్దీన్లను పట్టుకున్న ముగ్గురు వ్యక్తులు కత్తులతో విచక్షణ రహితంగా పొడిచారు. షేక్ మహ్మద్ను చంపడమే లక్ష్యంగా చేసుకున్న దుండగులు ప్రాణం పోయేంత వరకు పొడిచారు. అనంతరం పెట్రోలింగ్ వాహనం శబ్దం విని క్వాలిస్ను వదిలేసి అక్కడి నుంచి పరారయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రక్తపు మడుగులో పడివున్న ఫయాజుద్దీన్ను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రాణాలు విడిచాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.