లాక్డౌన్ సమయంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) శర వేగంగా ఫ్లైఓవర్లు, రోడ్ల పనులను పూర్తి చేయడానికి కృషి చేస్తోంది. తెలంగాణ మంత్రి కేటీఆర్ సూచనలతో జీహెచ్ఎంసీ ఈ పనుల వేగాన్ని పెంచింది.స్ట్రాటజిక్ రోడ్ డెవలప్ మెంట్ (ఎస్ఆర్డీపీ)లో భాగంగా నగరంలోని మొత్తం 11 ప్రాంతాల్లో ఈ నిర్మాణ పనులు వేగంగా పూర్తవుతున్నాయి. కరోనా నేపథ్యంలో తక్కువ మంది కార్మికులతోనే ఈ పనులు కొనసాగిస్తున్నారు. రాత్రింబవళ్లు పనులు వేగంగా కొనసాగుతున్నాయి.
నగరంలో మొత్తం 11 ప్రాంతాల్లో రూ.834.44 కోట్లతో ఈ పనులు మొదలు పెట్టగా ఇప్పటివరకు రూ.356.47 కోట్ల పనులు పూర్తయ్యాయి. 2020 జూన్లోగా మిగతా రూ.436.52 కోట్ల పనులను కూడా పూర్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వం కాంట్రాక్టర్లను ఆదేశించింది. రోడ్లపై ట్రాఫిక్ లేకపోవడంతో పనులు మరింత వేగంగా కొనసాగిస్తున్నామని జీహెచ్ఎంసీ ఇంజనీర్లు తెలిపారు.
ప్రస్తుతం ఎల్బీనగర్ రింగ్ రోడ్, నాగోల్ ఎక్స్రోడ్, కామినేని జంక్షన్, బైరమల్గూడ జంక్షన్, రోడ్ నంబరు 45 బయోడైవర్సిటీ జంక్షన్, జూబ్లిహిల్స్ ఎలెవేటెడ్ కారిడార్, ఓయూ కారిడార్, హైటెక్సిటీ ఎంఎంటీఎస్ రోడ్ అండర్ బ్రిడ్జ్ తదితర ప్రాంతాల్లో నిర్మాణ పనులు జరుగుతున్నాయి.