తెలంగాణలోని హుజూర్ నగర్ ఉపఎన్నిక షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మావతి రెడ్డికి టిక్కెట్టు కేటాయిస్తూ కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆమె పేరును కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ప్రకటించింది. హుజూర్నగర్ అసెంబ్లీ స్థానంలో ఎవరిని అభ్యర్ధిగా నిలపాలనే దానిపై కాంగ్రెస్ పార్టీ కోర్ కమిటీ ఇటీవల చర్చించింది.
ఈ చర్చలో ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి పద్మావతిని బరిలోకి దింపాలని నిర్ణయం తీసుకొన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కోదాడ నుంచి పోటీ చేసి పద్మావతి ఓటమిపాలయ్యారు. హుజూర్ నగర్ లో ఉపఎన్నిక పోరును కాంగ్రెస్, టీఆర్ఎస్ లు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గెలుపుపై ఇరుపార్టీల నేతలు ధీమాతో ఉన్నారు. టీఆర్ఎస్ తరపున సైదిరెడ్డి, బీజేపీ నుంచి శ్రీకళారెడ్డి పోటీ చేస్తున్నారు.
మరోవైపు హుజూర్నగర్ కు చెందిన యూత్ కాంగ్రెస్ నేత చామల కిరణ్ కుమార్ రెడ్డికి హుజూర్నగర్ అసెంబ్లీ టిక్కెట్టును ఇవ్వాలని కూడ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం కూడ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తప్పుబట్టింది.ఈ విషయమై ఎఐసీసీకి నివేదికను కూడ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పంపింది.