తాజాగా నిర్వహించిన పరిశోధనలలో భారత్లో జలసంక్షోభం అత్యంత తీవ్ర స్థాయికి చేరుకుందని వెల్లడైంది. నీరు పూర్తిగా ఎండిపోయే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని హెచ్చరించింది. పక్కా ప్రణాళికలతో జలసంరక్షణ చర్యలకు పూనుకోవాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పింది. ప్రపంచవ్యాప్తంగా 189 దేశాల్లో రాష్ట్రాలవారీగా జల సంక్షోభం, కరవు ముప్పు, వరదల ముప్పును అధ్యయనం చేసిన ‘ప్రపంచ వనరుల సంస్థ(డబ్ల్యూఆర్ఐ)’.. ‘ఆక్వెడక్ట్ వాటర్ రిస్క్ అట్లాస్’ పేరుతో నివేదిక విడుదల చేసింది.
17 దేశాల్లో జల సంక్షోభం అత్యంత తీవ్రస్థాయిలో ఉంది. ఈ జాబితాలో భారత్ 13వ స్థానంలో ఉంది. ఉత్తర భారతంలో భూగర్భజలాలు వేగంగా తగ్గుతున్నాయి. ”చెన్నైలో ఇటీవల ఎదురైన జల సంక్షోభాన్ని ప్రపంచమంతా గమనించింది. అయితే, భారత్లోని పలు ఇతర ప్రాంతాలూ అలాంటి దుస్థితిని ఎదుర్కొంటున్నాయి” అని డబ్ల్యూఆర్ఐ సీనియర్ ఫెలో శశిశేఖర్ తెలిపారు.