భారీ వర్షాల వల్ల అసోం రాష్ట్రంలో ముగ్గురు మరణించారు. బ్రహ్మపుత్ర నదితోపాటు పలు నదులు ఉప్పొంగటంతో వరదనీరు 530 గ్రామాలను ముంచెత్తింది. ఈ వరదనీటిలో ముగ్గురు వ్యక్తులు మునిగిపోయి మరణించారు. ధీమాజీ, లఖిమ్ పూర్, బిస్వానాథ్, దారంగ్, బార్పేట,నలబరి, చిరాంగ్, గోలాఘాట్, మాజూలీ, జోర్హట్, దిబ్రూఘడ్ జిల్లాల్లోని 11 రెవెన్యూ సర్కిళ్లలో 530 గ్రామాలు మునిగిపోయాయి. వరదలు విషమించడంతో సహాయ చర్యల కోసం సైన్యాన్ని రంగంలోకి దించారు.
బ్రహ్మపుత్ర, సియాంగ్, లోహిత్, బురిదేహింగ్, దేసంగ్, దేబాంగ్, దిఖ్వా, సుబన్ సిరి, జియా భారలీ, ధనసిరి, బేకి, మానస్, చంపామతి, గౌరంగ్, సంకోష్ ఉపనదులను వరదనీరు ముంచెత్తిందని, ఈ నదుల ప్రవాహం ప్రమాదకరంగా మారిందని కేంద్ర జలవనరుల కమిషన్ అధికారులు హెచ్చరించారు. పలు నదులు ప్రమాదకర స్థాయిని దాటి వరదనీరు ప్రవహిస్తుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అసోం జాతీయ విపత్తుల పునరావాస శాఖ అధికారులు హెచ్చరించారు.