ఓ వ్యక్తి వద్ద దొరికిన నోట్లు కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన పాతనోట్లేనని, అతని వద్ద పాత రూ.వెయ్యి నోట్లు రూ.9,95,000 లభించాయని డీఎస్పీ రఘు కోదాడలోని డీఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో తెలిపారు. కోదాడ పట్టణంలోని గుడిబండ రోడ్డులో గురువారం రాత్రి పట్టణ ఎస్సై ఎం. క్రాంతికుమార్ వాహన తనిఖీలో అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా కేంద్ర ప్రభుత్వ నిషేధించిన రూ.1000 నగదు 10కట్టలు, 9,95,000లు లభించాయి. పోలీసులు విచారించగా పేరు శామ్యూల్ అని, తనది ఖమ్మం పట్టణంలోని చర్చికంపౌడ్ అని, ప్రస్తుతం హైదరాబాద్ వనస్థలిపురంలో ఉంటున్నాడని తెలిపాడు.
ఖమ్మంకు చెందిన తన చిన్ననాటి మిత్రుడు కపిల్ పాతనోట్లు ఇచ్చి చలామణి నోట్లను తెస్తే.. రూ.50వేలు ఇస్తానని ఆశ చూపడంతో గుడిబండలోని ఓ వ్యక్తిని కలిసేందుకు వెళ్తున్నానని తెలిపాడు. నిందితుడు వినియోగించిన బుల్లెట్, సెల్ఫోన్, నగదును స్వాధీనం చేసుకుని.. నిందితుడికి సహకరించిన కపిల్, ఇంతియాజ్, ఫిరోజ్, రాములను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు. కేసు దర్యాప్తు చేసిన సీఐ శ్రీనివాసులరెడ్డి, సిబ్బందిని ఆయన అభినందించారు. ఈ సమావేశంలో పట్టణ ఎస్సై ప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు.