దేశరాజధాని, ఢిల్లీలో మరో ఘోరాగ్నిప్రమాదం సంభవించింది. గురువారం అర్ధరాత్రి ఈ భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో దాదాపు వంద పూరి గుడిసెలు అగ్నికి ఆహుతయ్యాయి. పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం… పశ్చిమ దిల్లీలోని కీర్తి నగర్లో ఓ ఫర్నీచర్ దుకాణంలో మంటలు చెలరేగాయి. క్రమంగా పక్కనే ఉన్న మురికివాడకు వ్యాపించాయి. పేదలకు చెందిన 100 ఇల్లు దగ్ధమయ్యాయి. దీంతో అక్కడి వారంతా నిరాశ్రయులయ్యారు.
ఫర్నీచర్ దుకాణంలో భారీగా మంటలు అంటుకోవడంతో ఆస్తి నష్టం లక్షల్లో సంభవించినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. గురువారం అర్ధరాత్రి దాటిన తరువాత దుకాణం నాలుగో అంతస్తులో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 30 అగ్నిమాపక యంత్రాలతో శుక్రవారం ఉదయానికి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదంలో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదానికి గల కారణం తెలియ రాలేదు.