లేచింది మహిళా లోకం అన్నట్టుగా.. తాజాగా లేచింది రైతు లోకం అని అనాల్సి వస్తుంది.. ఏమంటే, ఈ ఎన్నికలలో రైతులు ఆయా నేతలపై పోటీకి భారీ స్థాయిలో దిగుతున్నారు. తమ సమస్యలు పట్టని నేతలు, ఎన్నికలు రాగానే రైతులకు వరాలు ప్రకటిస్తున్నారు.. దీనితో నేతల తీరు మారదని నిర్ణయించుకొన్న రైతులే ఒక అడుగు ముందుకు వేసి, ఆయా నేతలపై పోటీకి భారీగా ముందుకు వస్తున్నారు. ఇప్పటికే తెలంగాణాలో కల్వకుంట్ల కవిత నియోజక వర్గం నిజామాబాద్ లో ఐదు వందల నుండి వెయ్యి మంది రైతులు పోటీకి దిగుతున్నారు. ఇక ఖమ్మంలో కూడా 200 లకు పైగా రైతులు పోటీకి సిద్ధం అవుతున్నారు.
తాజాగా, ప్రధాని పోటీ చేయనున్న వారణాసి నియోజకవర్గంలో ఈసారి భారీగా పోటీ చేయాలని రైతులు నిర్ణయించుకున్నారు. ఒకవేళ ఆయన తన నియోజక వర్గం మార్చుకున్నా కూడా, మోడీ ఎక్కడ నుండి పోటీకి దిగితే అక్కడే రైతులు కూడా వందల సంఖ్యలో పోటీకి సై అనేందుకు సిద్ధం అవుతున్నారు. ఇప్పటివరకు రైతుల సమస్యలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న బీజేపీ ప్రభుత్వం తీరుకు నిరసనగా రైతుల్ని పోటీకి దించాలని దక్షిణాది నదుల అనుసంధాన పథకం రైతు సంఘం తెలిపింది.
మోదీపై 111 మంది తమిళ రైతుల్ని బరిలో దించుతున్నట్లు సంఘం అధ్యక్షుడు అయ్యాకన్ను ప్రకటించారు. సమస్యల పరిష్కారం కోరుతూ గతంలో అయ్యాకన్ను నేతృత్వంలో ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద గతంలో 15 రోజులపాటు రైతులు ఆందోళను కొనసాగించిన విషయం తెలిసిందే. కావేరీ వ్యవహారం, పంట రుణాల సమస్య, ఆత్మహత్యకు పాల్ప డిన రైతులను ఆదుకోవాలంటూ అప్పట్లో రైతులు ఆరుబయటే వంటావార్పూ చేసుకుంటూ తమ నిరసన తెలియజేశారు. తాజాగా ప్రధాని మోదీ దేశంలో ఎక్కడ నుంచి పోటీ చేసినా ఆయనపై నామినేషన్ వేసి నిరసన తెలియజేయాలని నిర్ణయించినట్లు అయ్యాకన్ను ప్రకటించారు.
మొత్తానికి రైతులలో చైతన్యం వచ్చింది. ఈ చైతన్యం రైతుల బ్రతుకులను, దేశభవిష్యతును మార్చనుందేమో.. వేచి చూడాలి. మరో కోణంలో చుస్తే, ఇది కూడా విపక్షాల రాజకీయ ఎత్తుగడ అయ్యుండవచ్చు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
ఇమ్రాన్ వ్యాఖ్యలపై భారత్ చురకలు