బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 3 కార్యక్రమం ముగింపు దశకు వచ్చేసింది. సక్సెస్ ఫుల్ గా సాగుతున్న ఈ కార్యక్రమంలో 12వ వారం ఇంటి నుండి వరుణ్ సందేశ్ భార్య వితికా ఎలిమినేట్ అయ్యింది. ఇక ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ఆసక్తికరంగా మారింది. ఈ వారం మరొకరు బిగ్ బాస్ హౌజ్ని వీడనున్నారు. చివరి వారం హౌజ్లో ఐదుగురు సభ్యులు ఉండనున్నారు. అందులో ఒకరు బిగ్ బాస్ టైటిల్ అందుకున్నారు. అయితే ఈవారం నామినేషన్ ప్రక్రియ భిన్నమైనది, ప్రత్యేకమైనది అని బిగ్ బాస్ తెలిపారు. ఈ ప్రక్రియలో పాల్గొనే ఇంటి సభ్యుల్లో ఒక్కరు మాత్రమే గెలుస్తారు. గెలిచిన కంటెస్టెంట్ ‘టికెట్ టు ఫినాలే’ సొంతం చేసుకుంటారు. ఓడిపోయిన మిగతా సభ్యులు నామినేట్ అవుతారు. ఈ వారం నామినేషన్ ప్రక్రియలో భాగంగా ఇంటి సభ్యులందరూ బోర్డుపై ఉన్న వివిధ కలర్ బ్లాక్స్లో నుంచి వారికి నచ్చిన బ్లాక్ తీసుకొని దాని మీద ఏముందో చెప్పాలని బిగ్ బాస్ సూచించారు. ముందుగా శివజ్యోతి బోర్డ్పై ఉన్న బ్లాక్ని తీసుకోగా ఆమెకి 60 శాతం బ్లాక్ లభించింది. ఇక ఆ తరువాత వరుణ్ తీసిన బ్లాక్పై 40% అని, శ్రీముఖి తీసిన బ్లాక్పై 50% అని, అలీ తీసిన బ్లాక్పై 70% అని, బాబా భాస్కర్ బ్లాక్పై 40%, రాహుల్ బ్లాక్పై 50% అని రాసుంది. ఈ శాతాలే టాస్క్కు మూలాధారం కాగా, బ్యాటరీ ఉంటే నిండుగా.. జరుపుకోండి పండుగ అనే టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్.
టాస్క్లో భాగంగా ఇంటి సభ్యులు తమ బ్యాటరీ పర్సెంటేజ్ను పెంచుకోవాలి. ఇందుకోసం పలు టాస్క్లు చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం గార్డెన్ ఏరియాలో రెండు బెల్స్ ఏర్పాటు చేశారు. బజర్ మోగిన ప్రతిసారి మొదటిసారి బెల్ను మోగించిన ఇద్దరు ఇంటి సభ్యులు ఒక టాస్క్లో పోటీపడాల్సి ఉంటుంది. ఆ టాస్క్లో గెలిచిన వారికి 10 శాతం బ్యాటరీ రీఫిల్ అవుతుంది. ఇంటి సభ్యులు బ్యాటరీని రీఫిల్ చేసుకోవడానికి ఆరు అవకాశాలు ఇస్తామని బిగ్ బాస్ చెప్పారు. ఈ టాస్క్ ముగిసే సమయానికి ఎవరి బ్యాటరీ నిండుగా ఉంటే వారు ‘టికెట్ టు ఫినాలే’ సొంతం చేసుకుంటారని తెలిపారు. ఒకసారి బెల్ కొట్టిన ఇద్దరు సభ్యులు రెండోసారి బజర్ మోగినప్పుడు బెల్ కొట్టడానికి వీళ్లేదని బిగ్ బాస్ కండిషన్ పెట్టారు. ముందుగా బెల్ మోగించిన అలీ రెజా, శివజ్యోతి లు టాస్క్లో పాల్గొనగా, వారికి అరటి పండ్ల టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఇందులో ఎక్కువ అరటి పండ్లు తిన్న అలీ రెజా విజేతగా నిలచి తన బ్యాటరీని 10 శాతం పెంచుకున్నాడు . ఇక ఆ తర్వాత రాహుల్- వరుణ్ సందేశ్ పోటీ పడ్డారు. వారికి ఇచ్చిన ధర్మాకోల్ బ్యాగ్లని ఖాళీ చేయాల్సి ఉంటుంది. చివరికి ఎవరి బ్యాగ్లో ఎక్కువ థర్మాకోల్స్ ఉంటాయో వారే విజేతలుగా నిలస్తారని బిగ్ బాస్ తెలిపారు. పోటా పోటీగా సాగిన ఈ టాస్క్లో రాహుల్ విజేతగా నిలిచాడు.
ఇక ఆ తర్వాత బాబా భాస్కర్- శ్రీముఖి మధ్య టాస్క్ నడించింది. ఈ టాస్క్లో భాగంగా గార్డెన్ ఏరియాలో ఒక పిండి తొట్టె, ఒక ఈకల తొట్టె ఉంచారు. పిండి, ఈకల మధ్య ఇంగ్లిష్ ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. మొదట పిండి తొట్టెలోని పది ఆల్ఫాబెట్స్ను శ్రీముఖి, బాబా భాస్కర్ నోటితో ఒక్కొక్కటిగా తీసి పక్కనే ఉన్న బౌల్లో వేయాలి. అలాగే, ఈకల తొట్టెలోవి కూడా తీయాలి. ఇలా తీసిన ఆల్ఫాబెట్స్ మ్యాచ్ అవ్వాలి అని బిగ్ బాస్ ఆదేశించారు. అయితే ఇద్దరు సేమ్ ఆల్ఫాబెట్స్ మ్యాచ్ చేయగా, ముందుగా నోటితో ఆల్ఫాబెట్స్ను బయటికి తీసిన బాబా భాస్కర్ ఈ టాస్క్లో గెలిచారు. ఇక నాలుగో బజర్ మోగగానే ఇంటి సభ్యులు అందరు బెల్ కొట్టే ఛాన్స్ ఉంటుంది. అర్ధరాత్రి సమయంలో బిగ్ బాస్ బజర్ మోగించగా, నిద్రనుండి లేచి వచ్చిన బాబా, అలీలు బెల్స్ మోగించారు. దీంతో వీరిద్దరు టాస్క్ లో పాల్గొన్నారు . ఆ టాస్క్ ఏంటంటే ఇద్దరికి కలిపి ఓ మట్టీ టబ్ ఇచ్చిన బిగ్ బాస్ అందులో వారికి ఇచ్చిన పూలని అందులో నిలబెట్టాల్సి ఉంటుందని తెలిపారు. అయితే ఒకరి పూలని మరొకరు తీసే ప్రయత్నం కూడా చేయవచ్చు. ఎండ్ బెల్ మోగిన సమయానికి ఎవరి పూలు ఎక్కువగా ఉంటాయో వారు గెలిచినట్టు. తమ బ్యాటరీ రీఫిల్ చేసుకునే అవకాశాన్ని పొందుతారు. టాస్క్లో ఇద్దరు హోరా హోరీగా ఆడారు. పెట్టిన పూలని ఇద్దరు తీసి దూరంగా గిరాటేశారు. ఆసక్తికరంగా సాగుతున్న ఈ గేమ్లో విజేత ఎవరనేది నేటి ఎపిసోడ్లో తేలనుంది.