తెలంగాణలో టెన్త్ విద్యార్థుల కోసం నేడు సంక్షేమ హాస్టళ్లు తెరుచుకోనున్నాయి. వాయిదాపడిన టెన్త్ పరీక్షలను నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధం కావడంతో విద్యార్థుల సౌకర్యార్థం వసతిగృహాలను తెరువాలని అధికారులు నిర్ణయించారు. ఈ నెల 8 నుంచి టెన్త్ పరీక్షలు రాయనున్న 18వేల మందికిపైగా విద్యార్థులు గురువారం నుంచి హాస్టళ్లకు వచ్చేందుకు అనుమతిచ్చింది.
దీంతో హాస్టళ్లల్లో కల్పించాల్సిన ప్రత్యేక సౌకర్యాలు, కరోనా వైరస్ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రభుత్వం మార్గదర్శకాలు జారీచేసింది. వసతి గృహాలను శుభ్రపర్చడంతోపాటు, క్రిమిసంహారక ద్రావణాన్ని పిచికారీ చేసి సిద్ధంగా ఉంచారు. పిల్లలను ఇంటినుంచే పరీక్షా కేంద్రానికి పంపాల నుకుంటే, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కు ముందుగా సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు.