ధోనీ.. భారత క్రికెట్ జట్టులో అంకిత భావంతో ఆడే ఆటగాడిగా మాత్రమే కాదు, దేశం విషయంలో కూడా అదే అంకికభావం చూపుతున్నారు. ఒక పక్క కశ్మీర్లో అత్యంత ఆందోళనకర పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియని పరిస్థతి నెలకొంది. ఆర్టికల్ 35ఏ, ఆర్టికల్ 370లలో మార్పులు చేయవచ్చనే ప్రచారం జోరందుకున్న నేపథ్యంలో లోయ మొత్తం నివురు గప్పిన నిప్పులా మారింది. ఇటువంటి పరిస్థితుల్లో అత్యంత భద్రత మధ్య కూడా రాజకీయ నాయకులు, ప్రముఖులను ఇక్కడకు రావద్దని హెచ్చరికలు ఉన్నాయి. వారు కూడా అక్కడికి వెళ్లేందుకు ఒకటికి పదిసార్లు ఆలోచిస్తారు. అటువంటిది మహేంద్రుడు మాత్రం నిస్సంకోచంగా విధుల్లో చేరారు. ఎటువంటి మినహాయింపులు లేకుండా తన ర్యాంక్ అధికారులు నిర్వహించే విధులనే ఆయన కూడా నిర్వహిస్తున్నారు.
ధోనీ గురువారం నుంచి తన రెగ్యూలర్ విధులను చేపట్టారు. వాస్తవానికి ఆయనకు గౌరవ లెఫ్టినెంట్ హోదాను సైన్యం కల్పించింది. ఈ హోదాలో ఉంటే వారికి రెగ్యూలర్ విధులు అప్పగించరు. కానీ, ధోని కొన్ని నెలల క్రితం సైన్యానికి లేఖ రాస్తూ.. తనకు సాధారణ విధులు కూడా అప్పగించాలని కోరారు. దీంతో ఈసారి ఆయనకు అత్యంత సమస్యాత్మకమైన శ్రీనగర్లో గస్తీ విధులను అప్పగించారు. ఈ క్రమంలో ఆయన సాధారణ జవాన్లకు కేటాయించే బ్యారాక్ల్లోనే ఉంటున్నారు. వాస్తవానికి ధోనికి లెఫ్టినెంట్ కల్నల్ హోదా ఉంది. దీంతో ఆయనకు ప్రత్యేక గది కేటాయిస్తారు. కానీ, ధోనీ ఆ ఏర్పాట్లను నిరాకరిస్తూ సైన్యానికి లేఖ రాశారు. తన కోసం ఎటువంటి ప్రత్యేకమైన ఏర్పాట్లను కోరలేదు. అందరి వలే ఉదయం 5 గంటలకు నిద్రలేచి దినచర్యను ప్రారంభిస్తున్నారు. సాధారణ జవాన్లతోపాటే కలిసి భోజనం చేస్తున్నారు.